సఫారీలకు భారీ లక్ష్యం
నాగ్ పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. రెండో రోజు ఆటలో భాగంగా గురువారం సెకెండ్ ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 46.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(5) ఆదిలో పెవిలియన్ కు చేరినా.. శిఖర్ ధవన్(39), చటేశ్వర పూజారా(31)లు రాణించారు. అనంతరం విరాట్ కోహ్లి(16), రహానే(9)లు నిరాశ పరిచారు. ఆపై రోహిత్ శర్మ(23), అమిత్ మిశ్రా(14) ఫర్వాలేదనిపించడంతో టీమిండియా సాధారణ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ ఐదు వికెట్లు తీయగా,మోర్నీ మోర్కెల్ మూడు, హార్మర్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు 11/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 33.1 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జేపీ డుమినీ(35) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. భారత స్పిన్ త్రయం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. రవి చంద్రన్ అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సఫారీలకు మరోసారి షాకివ్వగా, అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
సంబంధిత వార్తలు