విజయానికి చేరువగా టీమిండియా

విజయానికి చేరువగా టీమిండియా - Sakshi


నాగ్ పూర్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా మరో విజయం సాధించడానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. 310 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మూడో రోజు టీ విరామసమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఎదురీదుతోంది. శుక్రవారం ఆటలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా(39), డు ప్లెసిస్(39)లు రాణించగా, ఎల్గర్(18), ఏబీ డివిలియర్స్(9) నిరాశపరిచారు.



ఓ దశలో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను కెప్టెన్ హషీమ్ ఆమ్లా- డు ప్లెసిస్ ల జోడి చక్కదిద్దింది. వీరి జోడి ఐదో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా తేరుకున్నట్లు కనిపించింది. కాగా, టీ విరామానికి కొద్ది ముందు ఈ జోడిని అమిత్ మిశ్రా పెవిలియన్ కు పంపి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , అమిత్ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించారు.


 


అంతకుముందు 32/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ఆరంభమైన అరగంటకే ఎల్గర్, డివిలియర్స్ పెవిలియన్ చేరారు. ఇంకా దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 159 పరుగులు అవసరం కాగా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజ్ లో జేపీ డుమినీ(15),విలాస్(2)లు ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top