ప్రాణం తీసిన సంబరం
ఐజ్వాల్: మిగతా క్రీడలతో పోలిస్తే ఫుట్బాల్లో గోల్ చేసిన అనంతరం ఆటగాళ్లు కాస్త ఎక్కువగానే సంబరాలు చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఆనందమే ఓ ఫుట్బాలర్ ప్రాణం తీసింది. మిజోరాం ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో భాగంగా బెత్లెహామ్ వెంగ్తలాంగ్ ఎఫ్సీకి ఆడుతున్న పీటర్ బయాక్సంగ్జువాలా తమ జట్టు తరఫున గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు.
దీంతో పట్టలేని ఆనందంతో 23 ఏళ్ల పీటర్ తలకిందులుగా ఎగిరి సంతోషాన్ని వ్యక్తం చేసే సమయంలో అనుకోకుండా తల నేరుగా నేలకు బలంగా తాకి పడి పోయాడు. దీంతో అతడి వెన్ను పూర్తిగా దెబ్బతింది. అతడు కిందపడిన సమయంలో ఇతర ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అతడిపై పడిపోయారు. అయితే జరిగిన విషయాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోగా... ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు.