'వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ నాదే కావాలి'
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తన అంతర్జాతీయ క్రికెట్ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై భారత స్పెషలిస్టు బ్యాట్స్మన్ సురేశ్ రైనా పెదవి విప్పాడు. గత కొంతకాలంగా భారత జట్టులో స్థానం కోల్పోయి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న రైనా.. 2019 వన్డే వరల్డ్ కప్లో ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2015లో చివరిసారి వన్డే ఆడిన రైనా.. 2019 వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ కూడా తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్ కప్ లో భారత్ జట్టు తన ఫైనల్ పోరును పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియాతో ఆడుతుందని రైనా జోస్యం చెప్పాడు.
‘2019 వరల్డ్ కప్ లో నేను ఆడతా. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ జట్టు..పాకిస్తాన్ లేదా ఆసీస్ తో తలపడుతుంది. నేను ఫోర్ ను షాట్ గా కొట్టి మ్యాచ్ ను ముగించాలి. అదే నాకల. కచ్చితంగా అలా జరగాలని కోరుకుంటున్నా. నేను ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్స్ షాట్ కొట్టినప్పుడు నా కూతురు గ్రేసియా చప్పట్లతో నన్ను అభినందించాలి. అదే సమయంలో స్టేడియంలో భారతదేశ జెండా ఎగురుతూ ఉండాలి'అని రైనా పేర్కొన్నాడు. తాను ఇప్పటికే కావాల్సినంత డబ్బును సంపాదించనని, డబ్బు అనేది ప్రస్తుతం తనకు ముఖ్యం కాదన్నాడు. దేశం కోసం ఆడటంలోనే గొప్ప కిక్ ఉంటుందని రైనా అన్నాడు. తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తానని పేర్కొన్న రైనా.. ఇంకా నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడతానన్నాడు.