గెలిస్తే క్వాలిఫయర్-2.. ఓడితే ఇంటికే!

గెలిస్తే క్వాలిఫయర్-2.. ఓడితే ఇంటికే!


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 9 లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారమిక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న తొలి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి కోల్‌కతా జట్టుకు 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర ధావన్‌ తొలి ఓవర్‌లో (10 బంతులు; రెండు ఫోర్లు) 10 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. దాంతో సన్‌రైజర్స్‌ 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ధావన్‌ ఔట్‌ కావడంతో కాస్తా తడబడిన హైదరాబాద్‌ ఆటగాళ్లు హెన్రిక్స్, వార్నర్‌ మ్యాచ్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి హెన్రిక్స్ 71 పరుగుల వద్ద కులదీప్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి 31 పరుగులతో వెనుతిరిగాడు.



అదే ఓవర్‌లో వెంటనే డేవిడ్‌ వార్నర్‌ 28 పరుగులకే చేతులేత్తేశాడు. మూడు వికెట్లు కోల్పోవడంతో ఢీలా పడిన సన్‌రైజర్స్‌ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులతో నిలకడగా ఆటను కొనసాగించింది. అంతలోనే హుడా 21 పరుగుల వద్ద రన్‌ ఔట్‌ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన  ఆటగాడు కటింగ్‌ కనీసం ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. పీకల్లోతు కష్టాల్లోకి కురుకపోయిన సన్‌రైజర్స్‌ జట్టు యువరాజ్‌ సింగ్‌ రాకతో కాస్తా తెరుకున్నా.. యువరాజు 44 పరుగులకే ఔట్‌ అయ్యాడు. అనంతరం ఓజా (7), భువనేశ్వర్‌ కుమార్‌ (1) సింగల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా బిపుల్‌ శర్మ (14), శరణ్‌ (0) నాటౌట్‌గా నిలిచారు.  కోల్‌కతా బౌలర్లు మోర్కెల్‌, హోల్డర్‌ తలో రెండు వికెట్లు తీసుకోగా, కులదీప్‌ యాదవ్‌ ఏకంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.



ఈ సీజన్‌లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది.



ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. బ్యాటింగ్‌లో తడబడినా సన్‌రైజర్స్‌ జట్టు. మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇందులోనూ ఆందోళన చెందే సన్‌రైజర్స్‌ జట్టు.. బౌలింగ్‌లోనైనా కోల్‌తాను కట్టడి చేస్తుందో లేదా చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top