కోహ్లికి షాకిచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్!
సాక్షి, కోల్కతా : తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా జట్టు రెండు వన్డేకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. అయితే ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో నేడు రెండో వన్డే సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి చిన్న షాకిచ్చారు. తన డ్రీమ్ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు కల్పించిన స్మిత్.. కోహ్లికి మాత్రం అందులో ఎప్పుడూ స్థానం దక్కదని చెప్పారు. భారత్ నుంచి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బౌలర్ హర్బజన్ సింగ్లు తన డ్రీమ్ జట్టులో సభ్యులన్నారు. అయితే కోహ్లితో వ్యక్తిగతంగా తనకేమి విభేదాలు లేదన్నారు.
'కోహ్లి విధ్వంసక ఆటగాడే కాదు మంచి కెప్టెన్ కూడా. అతనితో నాకు ఎలాంటి గొడవలు లేదు. భారత ఆటగాళ్లతో అతడు ఎలా నడుచుకుంటాడన్నది నాకు అనవసరం. అయితే ఇతర దేశాల ఆటగాళ్లతో అతడు ఎలా ప్రవర్తిస్తాడన్నది గుర్తుంచుకోవాలి. నా కెరీర్లో 100వ వన్డే మైలురాయిని అందుకోనుండటం హ్యాపీగా ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే.. నేను డకౌట్ అయితే బాధపడను. పైగా జట్టు గెలిచినందుకు సంతోషపడతానని' స్మిత్ వివరించారు. సర్ డాన్ బ్రాడ్మన్, స్పిన్ దిగ్గజం షేన్వార్న్లను తన ఆల్టైమ్ టెస్ట్ జట్టులో ఉంటారని, మిచెల్ జాన్సన్, మైక్ హస్సీ ఆల్టైమ్ వన్డే జట్టులో ఉంటారని చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు