104 ఇన్నింగ్స్ ల తరువాత కోహ్లి..
పుణె: ఓ స్టార్ క్రికెటర్ ఏది చేసినా ఆసక్తికరమే.అటు సెంచరీలు నమోదు చేసినా, ఇటు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగినా చిత్రంగానే ఉంటుంది. తాజాగా భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి విషయంలో ఇదే జరిగింది. బ్యాట్ పడితే సెంచరీలు, డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి.. ఆసీస్ తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. క్రీజ్ లోకి వచ్చి రావడంతోనే అనవరసపు షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. చటేశ్వర పూజారా(6) రెండో వికెట్ గా అవుటైన తరువాత క్రీజ్ లో కి వచ్చిన విరాట్ ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆఫ్ స్టంప్ కు బయటకు వెళుతున్న బంతిని కోహ్లి అనవసరంగా వెంటాడి వెనుదిరిగాడు.
ఇలా కోహ్లి డకౌట్ గా అవుట్ కావడం 104 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ల తరువాత ఇది మొదటిసారి. 2014లొ కాడ్రిఫ్ లో జరిగిన వన్డేలో కోహ్లి చివరిసారి డకౌట్ గా అవుటయ్యాడు. ఇదిలా ఉంచితే, టెస్టుల్లో 45 ఇన్నింగ్స్ ల తరువాత కోహ్లి డకౌట్ గా అవుట్ అవుట్ కాగా, ఈ ఫార్మాట్ లో ఐదో సారి సున్నా పరుగులకే అవుటయ్యాడు.
256/9 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్..మరో నాలుగు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్ ను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మిచెల్ స్టార్క్(61) ఆఖరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ ఆదిలోనే మురళీ విజయ్(10) వికెట్ ను కోల్పోయింది. మురళీ విజయ్ ను హజల్ వుడ్ అవుట్ చేశాడు. ఆ తరువాత పూజారా, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో 44 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ ను కోల్పోయింది.