భారత బౌలర్ల విజృంభణ

భారత బౌలర్ల విజృంభణ - Sakshi


దంబుల్లా: ఐదు వన్డేల  సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. లంకను 43.2 ఓవర్లలో 216 పరుగులకే కట్టడి చేసి శభాష్ అనిపించారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ ఆపై భారత బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. ప్రధానంగా స్పిన్నర్ల దెబ్బకు లంక బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. భారత స్పిన్ త్రయం చాహల్, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు లంక పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటగా, చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించారు. పేసర్ బూమ్రాకు రెండు వికెట్లు తీశాడు.  భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్నిమాత్రమే లంక నిర్దేశించకల్గింది.


నిలకడగా ఆడుతున్న టీమిండియా

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతోంది. ఆరంభంలోనే రోహిత్‌ శర్మ నాలుగు పరుగుల వద్ద రన్నౌట్‌ అయినా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా 23  ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ కోల్పోయి  163 పరుగులు చేసింది. ధావన్‌ 101 పరుగులు, కోహ్లి 56 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.




అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు ఓపెనర్లు గుణతిలకా, డిక్ వెల్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించి మంచి రన్ రేట్ ను బోర్డుపై ఉంచారు. కాగా, గుణతిలకా(35) అవుటైన తరువాత డిక్ వెల్లా కుదరుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే డిక్ వెల్లా(64) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే డిక్ వెల్లా అవుటైన తరువాత లంకేయులు ఒక్కసారిగా తడబడ్డారు. 139 పరుగుల వద్ద లంక రెండో వికెట్ ను డిక్ వెల్లా రూపంలో కోల్పోగా, ఆపై వరుస విరామాల్లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు వరుసగా పెవిలియన్ చేరడంతో లంక స్కోరు మందగించింది. కాగా, ఏంజెలో మాథ్యూస్(36 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో లంక  రెండొందల మార్కును చేరింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top