112 పరుగులకే కుప్పకూల్చారు..

112 పరుగులకే కుప్పకూల్చారు..


వెల్లింగ్టన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 159 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆద్యంత చెలరేగిపోయిన సఫారీలు.. న్యూజిలాండ్ ను 32.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించారు. . దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ వంద మార్కుల స్కోరును కష్టపడి దాటింది. సఫారీలు విసిరిన 272 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చకుండా పెవిలియన్ కు క్యూకట్టేసింది.


కివీస్ జట్టులో గ్రాండ్ హోమ్(38 నాటౌట్), కేన్ విలియమ్సన్(28)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు.  ఏడుగురు కివీస్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ మూడు వికెట్లు సాధించగా, రబడా, పార్నెల్, పెహ్లుక్వో లు తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను కుప్పకూల్చారు. తాజా విజయంతో సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-1 తో ఆధిక్యం సాధించింది. తొలి వన్డేలో సఫారీలు విజయం సాధించగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top