ఆసీస్‌దే వన్డే సిరీస్

ఆసీస్‌దే వన్డే సిరీస్


మెల్‌బోర్న్: స్టీవెన్ స్మిత్ (112 బంతుల్లో 104; 7 ఫోర్లు) వీరోచిత సెంచరీతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూల జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో కైవసం చేసుకుంది. ఎంసీజీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది.



కెప్టెన్ డివిలియర్స్ (88 బంతుల్లో 91; 6 ఫోర్లు), మిల్లర్ (61 బంతుల్లో 45; 3 ఫోర్లు) రాణించినా.. మిగతా వారు విఫలమయ్యారు. 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్‌ను డివిలియర్స్, మిల్లర్ నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించి ఆదుకున్నారు.  కమిన్స్, ఫాల్క్‌నర్ చెరో రెండు వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు చేసి నెగ్గింది.



స్మిత్‌కు తోడు వేడ్ (59 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. సఫారీ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ విఫలం కావడంతో బెయిలీసేన 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో స్మిత్ మెరుపులు మెరిపించాడు.



వేడ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించి జట్టును విజయం అంచులకు చేర్చాడు.. చివర్లో ఫాల్క్‌నర్ (19 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడి లాంఛనం పూర్తి చేశాడు. స్టెయిన్, పార్నెల్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఐదో వన్డేఆదివారం జరుగుతుంది.

ఎంసీజీలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలవడం ఇదే తొలిసారి. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top