సింగిల్స్ చాంప్ వైష్ణవి


గాయత్రితో కలిసి డబుల్స్‌లో రన్నరప్  

 ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్

 

 సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వైష్ణవి రెడ్డి సత్తాచాటింది. కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె బాలికల అండర్-13 సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డబుల్స్‌లో పుల్లెల గాయత్రితో కలిసి బరిలోకి దిగిన వైష్ణవి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర ఈవెంట్‌లో మూడో సీడ్ తోకల పవన్‌కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు.

 

  ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో వైష్ణవి రెడ్డి... టాప్ సీడ్ సిమ్రాన్ సింగ్‌కు షాకిచ్చింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 13-21, 21-16, 21-13తో సిమ్రాన్‌పై విజయం సాధించింది. డబుల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన వైష్ణవి-గాయత్రి జంట 22-20, 17-21, 19-21తో టాప్ సీడ్ రిచా ముక్తిబోధ్-సిమ్రాన్ సింగ్ చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ఓడినప్పటికీ... తెలుగమ్మాయిలు చక్కని పోరాట పటిమ కనబరిచారు.

 

 బాలుర అండర్-13 ఫైనల్లో మూడో సీడ్ పవన్‌కృష్ణ 18-21, 16-21తో మైస్నమ్ మీరబ (మణిపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. బాలుర అండర్-13 డబుల్స్ టైటిల్ పోరులో శ్రీకర్ మడిన (ఏపీ)-మైస్నమ్ మీరబ (మణిపూర్) జోడి 13-21, 21-14, 21-14తో రెండో సీడ్  రితిన్- తోకల పవన్‌కృష్ణ (ఏపీ) ద్వయంపై గెలుపొందింది. బాలుర అండర్-15 డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ (ఏపీ) జంట 21-14, 21-16తో రెండో సీడ్ ప్రజ్ఞాన్ జ్యోతి గగోయ్-లక్ష్యాసేన్ జోడిపై విజయం సాధించింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top