షోయబ్ మాలిక్ సెంచరీ

షోయబ్ మాలిక్ సెంచరీ


పాకిస్తాన్ 375/3   జింబాబ్వేతో తొలి వన్డే

 లాహోర్: సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మంగళవారం గడాఫీ మైదానంలో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో కెరీర్‌లోనే వేగవంతమైన సెంచరీ (76 బంతుల్లో 112; 12 ఫోర్లు; 2 సిక్సర్లు)తో దుమ్ము రేపాడు. ఫలితంగా పాక్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్‌కు సొంతగడ్డపై వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. 2009 అనంతరం సెంచరీ సాధించడం షోయబ్‌కు ఇదే తొలిసారి. షోయబ్, సోహైల్ కలిసి మూడో వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.


పేలవ బౌలింగ్‌కు తోడు ఫీల్డింగ్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకున్న పాక్ ఆటగాళ్లంతా రాణించారు. ఓపెనర్లు హఫీజ్ (83 బంతుల్లో 86; 8 ఫోర్లు; 4 సిక్సర్లు), అజహర్ అలీ (76 బంతుల్లో 79; 9 ఫోర్లు; 2 సిక్సర్లు), హరీస్ సోహైల్ (66 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఉత్సేయకు రెండు వికెట్లు దక్కాయి. కడపటి వార్తలందేసరికి జింబాబ్వే 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. చిగుంబుర (80), విలియమ్స్ (25) క్రీజులో ఉన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top