ఆఫ్రిది అరుదైన ఘనత
దుబాయ్: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన రెండో ట్వంటీ 20లో ఆఫ్రిది మూడు వికెట్లు తీసి ఈ ఫార్మెట్ లో అత్యధిక వికెట్లను తీసిన బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకూ 86 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడిన ఆఫ్రిది 86 వికెట్లను తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో మరో పాకిస్థాన్ క్రికెటర్ సయీద్ అజ్మల్(85) రికార్డును ఆఫ్రిది తాజాగా అధిగమించాడు. ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లు జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జేమ్స్ విన్స్ లను ఆఫ్రిది అవుట్ తన వికెట్ల సంఖ్యను మరింత పెంచుకున్నాడు.
కాగా, రెండో ట్వంటీ 20 మ్యాచ్ ను ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెనర్ రాయ్(29), విన్స్(38), రూట్(20), బట్లర్(33)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమై సిరీస్ ను చేజార్చకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లలో అహ్మద్ షెహజాద్(28), రఫ్తుల్లా మహ్మద్(23),హఫీజ్(25),షోయబ్ మాలిక్(26), ఆఫ్రిది(24) లు ఓ మోస్తరుగా రాణించినా ఓటమి తప్పలేదు. అంతకముందు జరిగిన తొలి ట్వంటీ 20 లో ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు