డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా జోడి అర్హత

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా జోడి అర్హత


సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు భారత స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) అర్హత సాధించారు. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ వచ్చే నెలలో 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి సానియా అర్హత సాధించడం ఇదే తొలిసారికాగా... కారా బ్లాక్ 11వసారి పాల్గొననుంది. ఏడాది మొత్తంలో డబుల్స్ విభాగంలో అత్యుత్తమంగా రాణించిన ఎనిమిది జోడిలు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. సానియా-కారా బ్లాక్ నాలుగో జోడిగా ఈ టోర్నీకి అర్హత పొందింది. ఈ ఏడాది సానియా-కారా బ్లాక్ ద్వయం రెండు టైటిల్స్ సాధించడంతోపాటు మూడు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీకి అర్హత పొందడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలో నేను తొలిసారి పాల్గొంటున్నాను. మా ఇద్దరికీ ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాను’ అని ప్రస్తుతం ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఇంచియాన్‌లో ఉన్న సానియా మీర్జా వ్యాఖ్యానించింది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top