సైనా, సింధులకు నిరాశ

సైనా, సింధులకు నిరాశ


క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన భారత స్టార్స్     

 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్


 

 వుహాన్ (చైనా): కెరీర్‌లో రెండోసారి ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో పతకం సాధించాలని ఆశించిన భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధులకు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యే ఈ మెగా ఈవెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ సైనా, ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.

 

 ప్రపంచ ఐదో ర్యాంకర్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ సైనా 21-16, 13-21, 18-21తో ఓడిపోగా... సింధు 21-11, 19-21, 8-21తో ప్రపంచ మూడో ర్యాంకర్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది.50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో సైనా 2010లో, సింధు 2014లో కాంస్య పతకాలు గెలిచారు. ఈ మ్యాచ్‌కు ముందు జు యింగ్ తాయ్‌తో ఆడిన ఐదు పర్యాయాల్లో నాలుగుసార్లు ఓడిపోయిన సైనాకు ఈసారీ భంగపాటు తప్పలేదు. తొలి గేమ్‌లో వెనకబడ్డా కోలుకుని నెగ్గిన సైనా... రెండో గేమ్‌లో పూర్తిగా తేలిపోయింది.

 

 మూడో గేమ్‌లో 17-17తో స్కోరు సమంగా ఉన్నదశలో   అనవసర తప్పిదాలు చేసి ఓడింది. మరోవైపు సింధు సంచలనం నమోదు చేసేలా అనిపించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో తడబడింది. కీలకదశలో పాయింట్లు చేజార్చుకొని జురుయ్ లీకి పుంజుకునే అవకాశం ఇచ్చింది. మూడో గేమ్‌లో మాత్రం జురుయ్ లీ ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి సింధుకు తేరుకునే అవకాశం ఇవ్వలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top