సైనా, సింధులకు నిరాశ
క్వార్టర్స్లో పోరాడి ఓడిన భారత స్టార్స్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
వుహాన్ (చైనా): కెరీర్లో రెండోసారి ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో పతకం సాధించాలని ఆశించిన భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధులకు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యే ఈ మెగా ఈవెంట్లో ప్రపంచ నంబర్వన్ సైనా, ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.
ప్రపంచ ఐదో ర్యాంకర్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో రెండో సీడ్ సైనా 21-16, 13-21, 18-21తో ఓడిపోగా... సింధు 21-11, 19-21, 8-21తో ప్రపంచ మూడో ర్యాంకర్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది.50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో సైనా 2010లో, సింధు 2014లో కాంస్య పతకాలు గెలిచారు. ఈ మ్యాచ్కు ముందు జు యింగ్ తాయ్తో ఆడిన ఐదు పర్యాయాల్లో నాలుగుసార్లు ఓడిపోయిన సైనాకు ఈసారీ భంగపాటు తప్పలేదు. తొలి గేమ్లో వెనకబడ్డా కోలుకుని నెగ్గిన సైనా... రెండో గేమ్లో పూర్తిగా తేలిపోయింది.
మూడో గేమ్లో 17-17తో స్కోరు సమంగా ఉన్నదశలో అనవసర తప్పిదాలు చేసి ఓడింది. మరోవైపు సింధు సంచలనం నమోదు చేసేలా అనిపించింది. తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం చలాయించిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్లో తడబడింది. కీలకదశలో పాయింట్లు చేజార్చుకొని జురుయ్ లీకి పుంజుకునే అవకాశం ఇచ్చింది. మూడో గేమ్లో మాత్రం జురుయ్ లీ ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి సింధుకు తేరుకునే అవకాశం ఇవ్వలేదు.