చాంపియన్‌ సాయి బస్వంత్‌


సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ ఆలిండియా ఫిడే రేటింగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సాయి బస్వంత్‌ సత్తా చాటాడు. నాచారంలోని శ్రీ శ్రీనివాస ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 10 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో సాయి బస్వంత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. షేక్‌ ఫయాజ్, సురేశ్‌ చెరో 8 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఫయాజ్‌ రన్నరప్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన చివరి రౌండ్‌లో సాయి బస్వంత్‌ (9) అనురాగ్‌ కురువాడ (7)పై, షేక్‌ ఫయాజ్‌ (8) ఎస్‌.ఖాన్‌ (7.5)పై గెలుపొందారు.


 


పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ టి. శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన సాయి బశ్వంత్‌కు రూ. 20,000 ప్రైజ్‌మనీ లభించగా, ఫయాజ్‌కు రూ.15,000, సురేశ్‌కు రూ. 10,000 ప్రైజ్‌మనీగా అందింది. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాచారం కార్పొరేటర్‌ శాంతి, హెచ్‌డీసీఏ అధ్యక్షులు కేఎస్‌ ప్రసాద్, ఏఐసీఎఫ్‌ సభ్యుడు ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.



పదో రౌండ్‌ ఫలితాలు



సురేశ్‌ (8) నిఖిల్‌ (7)పై, ఎస్‌కే భాషా (7.5) అరవింద్‌ (6.5)పై, శరత్‌ చంద్ర (7) ఉమేశ్‌ (6.5)పై గెలిచారు. సాయి అక్షయ్‌ (7.5), స్పందన్‌ (7.5)... నరసింహా రవీంద్ర (7.5), ధరణి శ్రీనివాస్‌ (7.5)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి.  



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top