‘ధోని సేన గెలుపును తొలి రోజే ఊహించా!’
న్యూఢిల్లీ: లార్డ్స్ టెస్టులో భారత జట్టు గెలుస్తుందని మ్యాచ్ తొలి రోజే తాను ఊహించానని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన కుమారుడు అర్జున్తో కలిసి లార్డ్స్లో సచిన్ తొలి రోజు ఆటను చూశాడు. ‘మొదటి రోజు ముగియగానే భారత్దే పైచేయి అని అర్జున్కు చెప్పాను.
80 శాతం పరిస్థితి మనకు అనుకూలంగా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప మనకే అవకాశాలు ఉన్నాయని అన్నాను. అది నిజం కావడం సంతోషం’ అని మాస్టర్ అన్నాడు. తాజా గెలుపుతో తాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని, ఇది సమష్టి ప్రదర్శనకు ఉదాహరణ అని సచిన్ అభిప్రాయ పడ్డాడు.
షరపోవాను తప్పు పట్టవద్దు...: సచిన్ ఎవరో తెలీదని టెన్నిస్ స్టార్ షరపోవా చెప్పడంపై ఇటీవల వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె తప్పేమీ లేదని సచిన్ సమర్థించాడు. ‘నేను తెలీదని చెప్పడం అగౌరవపర్చడం కాదు. షరపోవాకు క్రికెట్ తెలీకపోవచ్చు. ఇది తప్పు కాదు’ అని అన్నాడు.
సంబంధిత వార్తలు