ఫెడరర్ వర్సెస్ జొకోవిచ్
లండన్: ఆరుసార్లు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ట్రోఫీని గెలిచిన స్విస్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు రోజర్ ఫెడరర్ మరోసారి ఫైనల్ కు చేరాడు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో ఫెడరర్ 7-5, 6-3 తేడాతో తన సహచర ఆటగాడు స్టాన్ వావ్రింకాపై గెలిచి... తుది పోరులో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. భారత కాలమాన ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి ఈ ఇద్దరి అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుల మధ్య ఫైనల్ సమరం జరుగనుంది. శనివారం జరిగిన మరో సెమీ ఫైనల్లో జొకోవిచ్ 6-3,6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించి తుది పోరుకు సిద్ధమయ్యాడు.
ఈ ఏడాది వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో జొకోవిచ్ 4-3 తేడాతో ముందంజలో ఉన్నాడు. ఇందులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లను జొకోవిచ్ కైవసం చేసుకుని ఫెడరర్ పై పైచేయి సాధించడం విశేషం. కాగా, ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ రౌండ్ రాబిన్ మ్యాచ్ లో జొకోవిచ్ కు ఫెడరర్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య జరిగే అంతిమ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. దీనిపై జొకోవిచ్ మాట్లాడుతూ.. తామిద్దరం ఎప్పుడు తలపడినా చాలా ఒత్తిడి ఉంటుందన్నాడు. ఈ సీజన్ లో 10 సార్లు ఫైనల్స్ కు చేరిన ఫెడరర్ పై గెలవాలంటే స్థాయికి తగ్గట్లు ఆడాలని జొకోవిచ్ పేర్కొన్నాడు.