శరత్ కొత్త చరిత్ర
ఆసియా పారా గేమ్స్లో ఆరు పతకాలతో రికార్డు
ఇంచియాన్: తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ భారత స్విమ్మర్ శరత్ మహదేవరావు గైక్వాడ్ ఆసియా పారా గేమ్స్లో ఆరో పతకాన్ని సాధించాడు. తద్వారా ఒకే ఆసియా క్రీడల్లో (పారా గేమ్స్తో కలిపి) అత్యధిక పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ‘పరుగుల రాణి’ పీటీ ఉష పేరిట ఉండేది. 1986 ఆసియా క్రీడల్లో ఉష నాలుగు స్వర్ణాలు, రజతంతో కలిపి ఐదు పతకాలు సాధించింది.
శుక్రవారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే రేసులో శరత్ గైక్వాడ్, స్వప్నిల్ పాటిల్, నిరంజన్, ప్రశాంత కర్మాకర్లతో కూడిన భారత బృందం 5ని:23.32 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఇంతకుముందు ఈ క్రీడల్లో 23 ఏళ్ల శరత్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజతం నెగ్గగా... 100 మీటర్ల బటర్ఫ్లయ్లో, 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో, 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్లో కాంస్య పతకాలు గెలిచాడు.