'అతని బ్యాటింగ్ అంతా కలలా ఉంది'
పల్లెకెలె:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. లంకేయులతో సిరీస్ లో భారత జట్టు సమష్టిగా రాణించి విదేశాల్లో తొలిసారి మూడు టెస్టుల సిరీస్ ను సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. ఈ తరహాలో సిరీస్ ను కైవసం చేసుకోవడంపై జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ జట్టులోని పలువురి ఆటగాళ్ల ప్రదర్శనను రవిశాస్త్రి ప్రస్తావించాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఆటగాడు చటేశ్వర పుజారాను రవిశాస్త్రి ప్రశంసించాడు. ' గత కొన్నేళ్లుగా పుజారా అద్భుతంగా ఆడుతున్నాడు. నాణ్యతతో కూడిన అతని నిలకడ, ఆటపై పట్టు నిజంగా అమోఘం. అతని బ్యాటింగ్ అంతా ఒక కలలా సాగుతుంది. ఏదొక జోన్ కు ఆడుతున్న సమయంలో టార్గెట్లను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్న విధంగా పుజారా బ్యాటింగ్ ఉంది. అత్యంత నైపుణ్యమున్న ఆటగాడు పుజారా'అని రవిశాస్త్రి ప్రశంసలలతో ముంచెత్తాడు.
అంతకుముందు కెప్టెన్ కోహ్లి సైతం పుజారాను కొనియాడుతూ.. కేవలం ఒక ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్న అతనునిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ భారత జట్టు విజయాల్లో భాగస్వామ్యం కావడం నిజంగా అభినందనీయమన్నాడు. ప్రస్తుతం టెస్టు జట్టులో ఇద్దరు అసాధారణ మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు ఉన్నారంటూ పుజారా, రహానేలను కోహ్లి ఇక్కడ ఉదాహరించాడు. అయితే టెస్టులకే అంకితమైన పుజారాకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
సంబంధిత వార్తలు