రణధీర్ అజేయ సెంచరీ


ఎ-డివిజన్ వన్డే లీగ్

 సాక్షి, హైదరాబాద్: రణధీర్ (124 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో హెచ్‌జీసీ జట్టు 13 పరుగుల తేడాతో ఎల్‌బీసీసీపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఎల్‌బీసీసీ బౌలర్లు దినేశ్, పరమేశ్వర్, విశాల్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌బీసీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులే చేయగలిగింది. దినేశ్ (65) అర్ధసెంచరీ చేయగా, గిరీశ్ (37) ఫర్వాలేదనిపించాడు.

 

  హెచ్‌జీసీ బౌలర్లు మోహన్, వినయ్, అవినాశ్, చరణ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో యాదవ్ డెయిరీ 145 పరుగుల తేడాతో సెయింట్ సాయిపై ఘనవిజయం సాధించింది. మొదట యాదవ్ డెయిరీ జట్టు 256 పరుగులు చేసింది. ఫైజల్ అలీ (110, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా, శ్రీనివాస్ (50) రాణించాడు. సెయింట్ సాయి బౌలర్లు రాజేశ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ సాయి జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. రాజా 38, రాజు 30 పరుగులు చేశారు. యాదవ్ డెయిరీ బౌలర్లలో సాయిచరణ్ (5/37) విజృంభించాడు. రిషబ్‌కు 4 వికెట్లు దక్కాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top