రాంచీలో ఢమాల్.. వైజాగ్ లో క్లైమాక్స్

రాంచీలో ఢమాల్.. వైజాగ్ లో  క్లైమాక్స్


నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం



19 పరుగులతో భారత్ ఓటమి  

సిరీస్ 2-2తో సమం 


చివరి వన్డే శనివారం 




చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా రాణించింది. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌ను మరపించేలా వన్డేల్లో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. రాంచీలోనే సిరీస్‌ను ముగించాలన్న భారత ఆశలపై నీళ్లు జల్లుతూ నాలుగో వన్డేలో నెగ్గింది. దీంతో సిరీస్ ఫలితం కోసం శనివారం వైజాగ్‌లో జరిగే ఐదో వన్డే వరకూ ఆగాల్సిందే.


 

బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పిచ్‌పై లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. రహానే, కోహ్లి మెరుగ్గా ఆడినా, ఇతర ఆటగాళ్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. కివీస్ వ్యూహాత్మక బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌కు భారత్ తలవంచింది. సిరీస్ మొత్తం విఫలమైన గప్టిల్ తొలిసారి న్యూజిలాండ్‌ను ఆదుకుంటే... సౌతీ, నీషమ్ చక్కగా బౌలింగ్ చేసి కివీస్‌ను రేసులో నిలబెట్టారు. 


 


రాంచీ: సొంతగడ్డపై భారత కెప్టెన్ ధోని పూర్తిగా నిరాశపర్చగా, జట్టు కూడా విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ధోని సేన స్థారుుకి తగ్గట్లుగా ఆడకపోవడంతో నాలుగో వన్డే న్యూజిలాండ్ వశమైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కివీస్ 19 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (84 బంతుల్లో 72; 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫలితంతో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన ఐదో వన్డే ఈ నెల 29న విశాఖపట్నంలో జరుగుతుంది.


 

తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం


భారత పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సహా మొత్తం ఏడు సార్లు టాస్ ఓడిపోరుున న్యూజిలాండ్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు మూడు మార్పులు చేయగా, అనారోగ్యంతో ఉన్న బుమ్రా స్థానంలో ధావల్ భారత జట్టులోకి వచ్చాడు. తొలి 15.2 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు స్కోరు... వికెట్ నష్టపోకుండా 96 పరుగులు. ఈ ఆరంభం చూస్తే ఆ జట్టు కనీసం 300 పరుగులు దాటుతుందనిపించింది. కానీ మరో సారి మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. మధ్య ఓవర్లలో మన స్పిన్నర్లు పూర్తిగా కట్టి పడేశారు. ఇన్నింగ్‌‌స తొలి ఓవర్‌ను ఉమేశ్ మెరుుడిన్‌గా వేసినా... ధావల్ వేసిన తర్వాతి ఓవర్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ధావల్ తర్వాతి ఓవర్లోనూ లాథమ్ (40 బంతుల్లో 39; 4 ఫోర్లు) మరో రెండు బౌండరీలు బాదాడు. 29 పరుగుల వద్ద గప్టిల్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను మిశ్రా వదిలేయడం అతనికి కలిసొచ్చింది. దూసుకుపోతున్న ఈ జోడీని ఎట్టకేలకు 16వ ఓవర్లో పటేల్ విడదీశాడు.





ఆ తర్వాత గప్టిల్, విలియమ్సన్ (59 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి 42 పరుగులు జోడించినా పరుగుల వేగం మందగించింది. 11నుంచి 24 మధ్య 13 ఓవర్లలో స్పిన్నర్లు 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. గప్టిల్‌ను పాండ్యా అవుట్ చేసిన తర్వాత విలియమ్సన్, టేలర్ (58 బంతుల్లో 35; 1 ఫోర్) కలిసి మళ్లీ ఇన్నింగ్‌‌సను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అరుుతే పిచ్ కూడా నెమ్మదించడంతో పరుగులు రావడం కష్టంగా మారింది.  మూడో వికెట్‌కు 46 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించిన మిశ్రా, తర్వాతి ఓవర్లో నీషమ్ (6) కథ ముగించాడు. వాట్లింగ్ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతీ పరుగు కోసం కష్టపడ్డ టేలర్ రనౌట్ కావడంతో కివీస్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. మ్యాచ్‌లో ముగ్గురు భారత స్పిన్నర్లు కలిపి 28 ఓవర్లలో 107 పరుగులు మాత్రమే ఇవ్వగా... చివరి పది ఓవర్లలో కివీస్ మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగింది.


 

రాణించిన రహానే


లక్ష్య ఛేదనలో భారత్ మరోసారి తొందరగానే రోహిత్ (11) వికెట్ కోల్పోరుుంది. అరుుతే ఆ తర్వాత రహానే, కోహ్లి (51 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి సమన్వయంతో దూసుకుపోయారు. గత మూడు మ్యాచ్‌లలో వైఫల్యం తర్వాత ఒత్తిడిలో ఉన్న రహానే ఈ సారి స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. బౌల్ట్ వేసిన ఓవర్లో ముందుగా ఫోర్ కొట్టిన అతను, ఆ తర్వాత చూడచక్కటి అప్పర్ కట్‌తో సిక్సర్ బాదాడు. అనంతరం సౌతీ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టాడు. మరో వైపు కోహ్లి చకచకా పరుగులు సాధించాడు. అరుుతే వీరిద్దరి 79 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి సోధి తెర దించాడు. దూరంగా వెళుతున్న బంతిని వేటాడి కోహ్లి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 61 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరుుతే ఏడు పరుగుల వ్యవధిలో రహానే, ధోని (31 బంతుల్లో 11) అవుట్ కావడం భారత్ కష్టాలు పెంచింది. నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న తర్వాత ధోని క్లీన్‌బౌల్డయ్యాడు. అరుుతే మరికొద్ది సేపటికే సౌతీ వరుస బంతుల్లో రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. లాథమ్ అద్భుత క్యాచ్‌కు మనీశ్ పాండే (12) వెనుదిరగ్గా, జాదవ్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో అక్షర్ పటేల్ (40 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్), ధావల్ కులకర్ణి (26 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోరుుంది.


‘వికెట్లు చేతిలో ఉంటే లక్ష్యాన్ని ఛేదించగలిగేవాళ్లం. వికెట్ నెమ్మదిగా మారుతూ రావడం వల్ల బ్యాటింగ్‌కు కష్టమైంది. 5-6 స్థానాల్లో ఆడిన ఆటగాళ్లకు అనుభవం తక్కువగా ఉంది. అరుుతే క్రికెట్ ఎంతో మారిపోరుున ఈ రోజుల్లో వాళ్లను భారీ షాట్లు ఆడకుండా ఆపడం మంచిది కాదు. 15-20 మ్యాచ్‌లు ఆడితే వారే నేర్చుకుంటారు. సిరీస్ గెలవాలంటే చివరి వన్డేలో మేం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’   - ధోని

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top