నిలకడ..అంతలోనే తడ'బ్యాటు'!
దంబుల్లా: భారత్ తో తొలి వన్డేలో శ్రీలంక తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆరంభంలో కుదురుగా ఆడిన లంకేయులు ఆపై వరుసగా కీలక వికెట్లను చేజార్చుకున్నారు. ప్రధానంగా భారత్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని టాపార్డర్ వికెట్లను కోల్పోయారు. తొలి వికెట్ ను 74 పరుగుల వద్ద కోల్పోయిన లంక.. రెండో వికెట్ ను 139 పరుగుల వద్ద నష్టపోయింది. ఆపై స్వల్ప వ్యవధిలో మరో నాలుగు వికెట్లను లంక కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. డిక్ వెల్లా(65), గుణ తిలకా(35), కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు పెవిలియన్ కు చేరారు.
లంక కోల్పోయిన ఆరు వికెట్లలో కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించగా, చాహల్ వికెట్ తీశాడు.టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు శుభారంభం లభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి చక్కటి పునాది వేశారు. కాగా, భారత స్పిన్నర్లు విజృంభణతో లంక ఇబ్బందుల్లో పడింది. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. 41.0 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.