కరోలినా వర్సెస్ సింధు

కరోలినా వర్సెస్ సింధు


న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పివి సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 21-17, 21-8 తేడాతో ఇండోనేషియాకు చెందిన 27వ ర్యాంకర్ ఫిత్రానిపై విజయం సాధించి క్వార్టర్ కు చేరింది. ఈ పోరులో తొలి గేమ్ ను కోల్పోయిన సింధు.. ఆ తరువాత రెండు గేమ్ ల్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది.  ప్రధానంగా నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు వరుస పాయింట్లతో దూసుకుపోయింది. తొలుత 11-4 తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన సింధు.. ఆపై మరో నాలుగు పాయింట్లను మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకుని గేమ్ ను సొంతం చేసుకుంది.


రేపు జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా మారిన్ తో సింధు తలపడనుంది. మరొక ప్రి క్వార్టర్ ఫైనల్లో మారిన్ 21-7,21-11తేడాతో చియా సిన్(చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది.ముఖాముఖి రికార్డులో సింధు4–5తో వెనుకబడి ఉంది. అయితే ఇటీవల ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ లో మారిన్ ను సింధు ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్న సంగత తెలిసిందే. అంతకుముందు చివరిసారి గత డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లో తలపడగా...  మారిన్‌పై సింధు గెలిచింది. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top