చెన్నైతో పోరులో చిత్తుగా ఓడిన పంజాబ్
1, 1, 3, 5, 9, 1, 1.. ఇదీ ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మన్ చేసిన స్కోర్లు! 193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెయిలీ సేన ఏ దశలోనూ ఆ దిశగా పరుగులు రాబట్టలేకపోయింది. పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు చేసింది. 97 పరుగుల భారీ విజయాన్ని దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్-8 పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానానికి ఎగబాగింది. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు సాధించిన చెన్నై ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పంజాబ్ ఆటగాళ్లలో మురళి విజయ్ 34, షాన్ మార్ష్ 10, చివర్లో సాహా 15 పరుగులు మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోవడం గమనార్హం. కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్లో తనకు తానే సాటి అని ధోనీ సేన మరోసారి రుజువుచేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. నెహ్రా, అశ్విన్ రెండేసి వికెట్లు నేలకూల్చారు.ఈశ్వర్ పాండే, మోహిత్ శర్మకు ఒక్కో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఓపెనర్లు మెక్ కల్లం (66), స్మిత్ (26), ధోనీ (41) చెలరేగడంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. రైనా (29), జడేజా (18) తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో అనురీత్ సింగ్, అక్షర్ పటేల్ కు ఒక్కో వికెట్ దక్కింది.