భారత్లో ఆడటం కష్టమే!
టి20 ప్రపంచకప్పై పీసీబీ వ్యాఖ్య
కరాచీ: భారత్లో జరగనున్న టి20 ప్రపంచకప్లో ఆడేందుకు పాకిస్తాన్ వెనకడుగు వేస్తోంది. తమ జట్టు అక్కడ పర్యటిస్తే దాడులకు గురయ్యే అవకాశం ఉందని పీసీబీ సంశయిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ సమావేశంలో ఐసీసీ ముందుంచింది. అలాగే భారత్లో పర్యటించేందుకు తమ ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కూడా చాలా తక్కువని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆడాల్సి వస్తే దుబాయ్, షార్జా, కొలంబోలాంటి తటస్థ వేదికలైతే ఆలోచిస్తామన్నారు.
గతంలో బీసీసీఐ, పీసీబీ అధ్యక్షుల చర్చల సందర్భంగా ముంబైలో తలెత్తిన పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘గొడవలు తలెత్తే అవకాశాలు ఉండటంతో భారత పర్యటనకు మా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కష్టమే. తటస్థ వేదికలైతే మాత్రం అనుమతి రావొచ్చని కొంత మంది చెబుతున్నారు. ఓవరాల్గా టి20 ప్రపంచకప్లో పాల్గొనే అంశం మొత్తం మా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే డిసెంబర్లో మాతో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్లో భారత్ పాల్గొనలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏం జరుగుతుందో చూడాలి’ అని ఖాన్ పేర్కొన్నారు.