సెమీస్‌లో ప్రణయ్

సెమీస్‌లో ప్రణయ్


సార్‌బ్రుకెన్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్... బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో దుమ్మురేపాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ ప్రణయ్ 21-14, 19-21, 30-28తో ఎమిల్ హోస్ట్ (ఇంగ్లండ్)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించాడు. గంటా 17 నిమిషాల పాటు జరి గిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి భారత ప్లేయర్‌కు గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో 7-7 స్కోరు తర్వాత ప్రణయ్ వెనుదిరిగి చూసుకోలేదు. అయితే రెండో గేమ్‌లో ఎమిల్ పుంజుకుని 9-9, 17-17, 19-19తో స్కోరును సమం చేశాడు.



ఈ దశలో నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించలేకపోయిన ప్రణయ్ రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో ప్రణయ్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. అయితే ఎమిల్ వరుస పాయింట్లతో చెలరేగి 19-19 వద్ద స్కోరును సమం చేశాడు. ఇక ఇక్కడి ఒక్కో పాయింట్‌తో ఇరువురు ఆటగాళ్లు ఆధిక్యంతో దోబుచులాడుకున్నారు. చివరకు 28-28 స్కోరు వద్ద ప్రణయ్ రెండు బలమైన స్మాష్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. హైదరాబాద్ ఆటగాడు బి. సాయి ప్రణీత్ మూడో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. 21-15, 14-21, 18-21తో ఇంద్ర బాగుస్ (ఇటలీ) చేతిలో ఓడాడు. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో అశ్విని-ఇవనోవ్ (రష్యా) జోడీ 19-21, 9-21తో క్రిస్-గ్రాబియెల్ (ఇంగ్లండ్) ద్వయం చేతిలో ఓడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top