పాక్ బోణి..
పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వన్డే ప్రపంచకప్ పూల్ - ఎ లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగినా.. చివరకు విజయం పాకిస్థాన్నే వరించింది. తమ జట్టు విజయం సాధించాలని కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్న పాక్ ప్రేక్షకులకు కాస్తంత ఊరట లభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఇప్పటిదాకా ప్రపంచకప్లో జింబాబ్వే.. పాకిస్థాన్ పై గెలిచింది లేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిస్బా(73), వహాబ్ రియాజ్ (54)తో రాణించారు. వారి ఇద్దరికి తోడు ఉమర్ అక్మల్ 33 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత ఓవరల్లో 7 వికెట్లకు 235 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో చటారా మూడు, విలియమ్స్ రెండు వికెట్లు తీశారు.
పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తటపటాయించింది. పాక్ పేసర్ ఇర్ఫాన్ జింబాబ్వే ఓపెనర్లతో పాటు మరో ఇద్దిరని అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు మరో బౌలర్ రియాజ్ నాలుగు వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు.
జింబాబ్వే బ్యాట్స్మెన్లో టేలర్ (50), విలియమ్స్ (33), హామిల్టన్ (29) మినహా ఎవరూ రాణించలేదు. చివరలో చిగుంబర 20 చేయటంతో జింబాబ్వే స్కోరు 200 మార్కు దాటింది.