ముంబై మ్యాచ్కు 9 మంది అనాథ బాలలు
దుబాయ్: సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడు ముందుండే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈసారి మరో అడుగు ముందుకేసింది. ముంబైలోని వివిధ ఎన్జీఓ సంస్థలకు చెందిన 9 మంది అనాథ బాలలను శనివారం జరిగే ముంబై, బెంగళూరు మ్యాచ్ను తిలకించేందుకు ఆహ్వానించింది. శుక్రవారం జట్టు సభ్యులను కలిసి తమ ఎన్జీఓల గురించి ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఈ పిల్లలు... అభిమాన ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి ముచ్చటించనున్నారు. తర్వాతి రోజు బ్లూ, గోల్డ్ కలర్ డ్రెస్లు ధరించి దుబాయ్ స్టేడియంలో తమ అభిమాన జట్టుకు మద్దతు తెలపనున్నారు.
ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ చేపడుతున్న ‘అందరికీ చదువు (ఈఎఫ్ఏ)’ కార్యక్రమంలో భాగంగా పిల్లలను దుబాయ్కు తీసుకెళ్లడం ఈ సీజన్లో మొదటి అడుగు. మే 3న వాంఖడేలో జరిగే మ్యాచ్ను ఈ కార్యక్రమానికి అంకితమివ్వనున్నారు. మహారాష్ట్రలోని వివిధ ఎన్జీఓలకు చెందిన 18 నుంచి 20 వేల మంది అనాథ పిల్లలు ఆ మ్యాచ్కు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి విస్తృతమైన అవగాహన కల్పించడానికి ఆటగాళ్లు ధరించే జెర్సీ భుజంపై ‘ఈఎఫ్ఏ’ లోగోతో పాటు చెస్ట్ భాగంలో ఐకాన్ ప్లేయర్ సచిన్ బొమ్మ, ఈఎఫ్ఏ లోగోను ముద్రించనున్నారు.