బ్యాటింగ్ ఆర్డర్ ఏ ఒక్కరి సొంతం కాదు!
కొలంబో:వన్డేలైనా.. టెస్టులైనా బ్యాటింగ్ ఆర్డర్ ఏ ఒక్కరి సొంత కాదంటున్నాడు టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ. మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ఫలానా వ్యక్తి ఈ స్థానంలో ఆడాలనే నిబంధనలు ఏమీ ఉండవన్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఐదో డౌన్ లో బ్యాటింగ్ దిగడంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించాడు.
'బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఎవరి సొంతం కాదు. అందుకు నేను కూడా మినహాయింపు ఏమీ కాదు. మీ బ్యాటింగ్ ఆర్డర్ ఏమిటని ఒక్కసారి జట్టులో ఎవర్నైనా అడగండి. ఆ నంబర్ ను ఎవరూ చెప్పలేరు. ప్రపంచంలో ఎక్కడా కూడా వారి స్థానాలను చెప్పే అవకాశమే ఉండదు'అని రోహిత్ పేర్కొన్నాడు. ఒకవేళ బ్యాట్స్ మెన్ గా తనను ఇక్కడ ఆడాలని మేనేజ్ మెంట్ సూచిస్తే ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేయాలన్నాడు. తన సొంత నిర్ణయాలేవీ ఉండవన్నాడు. ఒక ఆటగాడి నుంచి జట్టు ఏమి కోరుకుంటుందో అది చేయడానికి యత్నించాలని రోహిత్ తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానంలో ఉండగా .. రోహిత్ శర్మ (202) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో చివరి ఇన్నింగ్స్ ఆడేసిన రోహిత్.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
సంబంధిత వార్తలు