‘గులాబీ’ టెస్టును జరపలేం
బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహించాలనే ఆలోచనను విరమించుకున్నట్టు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌధరి తేల్చారు. ఇప్పటికిప్పుడు తొలిసారిగా గులాబీ బంతితో మ్యాచ్ను జరపలేమని, దులీప్ ట్రోఫీలో ముందుగా ఈ ప్రయోగం చేస్తామని ఆయన తెలిపారు. ‘ఇలాంటి మ్యాచ్ను నిర్వహించే ముందు పిచ్ పరిస్థితి, ఆటగాళ్ల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మేం ఎప్పటినుంచో చెబుతున్నట్టుగానే దులీప్ ట్రోఫీని డే అండ్ నైట్ మ్యాచ్గా జరిపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఆ తర్వాతే ఇంగ్లండ్, ఆసీస్లతో జరిగే టెస్టు సిరీస్లో దీని అమలు గురించి ఆలోచిస్తాం’ అని అమితాబ్ తెలిపారు. కివీస్తో తొలి టెస్టుకు ముందు దులీప్ ట్రోఫీ జరగనుండగా దీంట్లో పలువురు స్టార్ క్రికెటర్లు ఆడనున్నారు. అటు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్జడ్సీ) కూడా భారత్లో ఫ్లడ్లైట్ల కింద టెస్టును ఆడేందుకు గతంలోనే సుముఖత వ్యక్తం చేయలేదు.