కొత్త కుంపటి సాధ్యమా?

కొత్త కుంపటి సాధ్యమా?


అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పోటీగా ఒక కొత్త సంస్థ తయారు కాబోతోందని, ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఒక కంపెనీ పేరును రిజిస్టర్ చేసి క్రికెటర్లను సంప్రదిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ క్రికెట్‌లీగ్ (ఐసీఎల్) నిర్వహించిన సుభాష్ చంద్ర దీని వెనక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన ఐసీసీ, బీసీసీఐలని కాదని కొత్త కుంపటి సాధ్యమేనా?

 

సాక్షి క్రీడావిభాగం : ప్రస్తుతం క్రికెట్‌ను పూర్తిగా నియంత్రిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో కీలకం. మిగిలిన టెస్టు దేశాల దగ్గర పెద్దగా ఆదాయం, పవర్ లేదు. కాబట్టి ఈ మూడు దేశాలదే పూర్తిగా ఐసీసీలో ఇష్టారాజ్యం. పాకిస్తాన్‌తో పాటు దక్షిణాఫ్రికా లాంటి క్రికెట్ బోర్డులకు ఇది పెద్దగా రుచించని అంశం. అయినా ఐసీసీతో జగడానికి దిగలేరు. కారణం... ఆ దేశాల్లో ఉన్న మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం స్వల్పం. ఐసీసీ నుంచే వాటా రావాలి.



కాబట్టి మిగిలిన దేశాలన్నీ ఐసీసీ ఏం చెప్పినా తలూపడం తప్ప మరేం చేయలేవు. క్రికెట్ చాలా పెద్ద వ్యాపారం. ప్రతి ఏటా వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. టీవీల ద్వారా వచ్చే ఆదాయం ఒక్క ఐసీసీకే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల పైన ఉంటుంది. మిగిలిన దేశాలన్నీ వాళ్ల క్రికెట్‌ను భారీ రేట్లకే అమ్ముకుంటాయి. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ ప్రసారం కోసం టీవీ సంస్థలు బాగా పోటీ పడతాయి.



ప్రస్తుతం స్టార్ సంస్థ భారత్‌లో అన్ని మ్యాచ్‌లతో పాటు ఐసీసీ మ్యాచ్‌ల ప్రసార హక్కులను తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క ఐపీఎల్ మినహా ప్రధాన క్రికెట్ అంతా స్టార్ గ్రూప్ దగ్గరే ఉంది. 2018 నుంచి ఐపీఎల్ కూడా స్టార్ ఖాతాలోకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతగా గుత్తాధిపత్యం ఒక్క సంస్థకే ఉంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి. దీంట్లోంచి పుట్టిన ఆలోచన రెబల్ లీగ్.

 

అంత సులభం కాదు...

ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం కొత్త సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుని ఒక టి20 లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ముందు క్రికెటర్లు అంగీకరించాలి. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రస్తుత జాతీయ జట్లలో ఉన్న క్రికెటర్లు ముందుకు రావాలి. ధోని, కోహ్లి, స్మిత్, వాట్సన్, మెకల్లమ్, గేల్... ఇలా పెద్ద ఇమేజ్ ఉన్న క్రికెటర్లు భారీ సంఖ్యలో కొత్త సంస్థతో చేరాలి.



ఏ క్రికెటర్ అయినా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ దేశ బోర్డు నుంచి వేటు పడుతుంది. అయినా సిద్ధమై భారీ మొత్తానికి ఆశపడి ముందుకు వచ్చినా కొత్త కుంపటి ఎంతకాలం ఉంటుందనే సందేహం వస్తుంది. కాబట్టి క్రికెటర్లు అంత తొందరగా రిస్క్ చేయరు. గతంలో ఐసీఎల్ సమయంలో డబ్బుకి ఆశపడి కొంతమంది యువ క్రికెటర్లు బయటకు వెళ్లి కెరీర్‌ను కోల్పోయారు.  

 

ఇది కొత్తేం కాదు...

 క్రికెట్ పాలకులకు పోటీగా కొత్తగా టోర్నీలు నిర్వహించడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1970వ దశకంలో వరల్డ్ సిరీస్ క్రికెట్ నిర్వహించారు. అలాగే 2007 నుంచి 2009 వరకు ఐసీఎల్ నిర్వహించారు. కానీ ఇవేవీ మార్కెట్‌లో నిలబడలేకపోయాయి. నిజానికి 2007లో సుభాష్ చంద్ర ఐసీఎల్ ప్రారంభించినప్పుడు... భారత్‌లో అదే మొదటి టి20 లీగ్. తొలి ఏడాది ఈ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. నిజానికి పెద్ద పేరున్న క్రికెటర్ల సంఖ్య స్వల్పంగానే ఉన్నా ఆదరించారు.



అయితే 2008లో బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభించింది. ఐసీఎల్, ఐపీఎల్ రెండూ ఒకే మాదిరి లీగ్‌లు. ఐపీఎల్ అధికారిక లీగ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లంతా ఇందులో ఆడేందుకు క్యూ కట్టారు. దీంతో ఈ లీగ్ సూపర్ హిట్టయింది. పెద్ద క్రికెటర్లు ఉన్న లీగ్ అందుబాటులోకి రావడంతో సహజంగానే ఐసీఎల్‌పై ఆసక్తి తగ్గిపోయింది. క్రమంగా ఆ లీగ్ కనుమరుగైంది.

 

ఎంతమంది వస్తారు?

 ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లోని టి20 లీగ్‌ల ద్వారా పెద్ద క్రికెటర్లందరికీ భారీగా ఆదాయం వస్తోంది. లీగ్‌లు, ఎండార్స్‌మెంట్లు కలిపి సాధారణ క్రికెటర్ కూడా ఏడాదికి నాలుగైదు కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి. ఒకవేళ కొత్త సంస్థ 10 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు ముందుకొచ్చినా క్రికెటర్లు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ కెరీర్ చివరి దశలో ఉన్న వాళ్లు ముందుకొచ్చినా... యువ క్రికెటర్లు ఆసక్తి చూపించకపోవచ్చు. స్టార్ క్రికెటర్లు లేకుండా ఏ లీగ్ కూడా ముందుకు సాగదు.

 

సుదీర్ఘ ప్రక్రియ...

 ఒకవేళ ఎవరైనా ఐసీసీకి పోటీగా కొత్త సంస్థను ప్రారంభించాలంటే చాలా సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఇది సాధ్యం కాదు. ఇదో సుదీర్ఘ ప్రక్రియ. ప్రతి దేశంలోనూ సొంత స్టేడియాలు కావాలి. ప్రతిదేశంలో తమ ప్రతినిధులు ఉండాలి. ప్రతి రాష్ట్రంలోనూ క్రికెటర్లను తయారు చేయాలి. వీళ్లందరికీ సుదీర్ఘ కాలం ఆర్ధిక భద్రత కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. క్రికెట్ మార్కెట్ మీద ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన ఆలోచన కాదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top