ఖాతా తెరిచిన ముంబై
బెంగళూరు: ముంబై ఇండియన్స్ తలరాత మారింది. ఐపీఎల్-8లో ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఐదో మ్యాచ్ లో బోణి కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై 18 పరుగుల తేడాతో గెలిచింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రోహిత్ సేన చివరి వరకు శ్రమించింది. బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
డివిలియర్స్ (41; 11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ వీసె(47; 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బిస్లా 20, గేల్ 10, కోహ్లి 18, దినేష్ కార్తీక్ 18, ఇక్బాల్ అబ్దుల్లా 20 పరుగులు చేశారు. రోసౌ డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో హర్భజన్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. మెక్లీనగన్, మలింగ, బుమరాష్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది.ఉన్ముక్త్ చాంద్(58), సిమన్స్(59) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ వీసె 4 వికెట్లు నేలకూల్చాడు. చహాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. హర్భజన్ సింగ్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.