బెంగళూరు టార్గెట్ 210
బెంగళూరు: రోహిత్ శర్మ మెరుపులకు తోడు ఉన్ముక్త్ చాంద్(58), సిమన్స్(59) అర్ధసెంచరీలు చేయడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ముందు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది.
ఓపెనర్ పార్థీవ్ పటేల్(12) విఫలమైనప్పటికీ సిమన్స్, చాంద్ వేగంగా ఆడి రెండో వికెట్ కు 46 బంతుల్లో 72 పరుగులు జోడించారు. సిమన్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 59 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే ఎదురు దాడి చేశాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు పిండుకున్నాడు. చాంద్ 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి అవుటయ్యాడు.
చాంద్ పెవిలియన్ చేరిన తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. పొలార్డ్(5), రాయుడు(0), రోహిత్ శర్మ(42), హర్భజన్ సింగ్(0) అవుటయ్యారు. 19 ఓవర్ లో ముంబై 3 వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ వీసె 4 వికెట్లు నేలకూల్చాడు. చహాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.