ఆసీస్కు అడ్డు గోడలా..!
పల్లెకిలా: తొలి టెస్టులో భాగంగా శ్రీలంకకు మొదటి ఇన్నింగ్స్లో చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం లంకేయుల్ని ఆలౌట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ అడ్డు గోడలా నిలవడంతో ఆ జట్టును ఆలౌట్ చేసి మరోసారి పైచేయి సాధించాలనుకున్న ఆసీస్ ఆటలు సాగలేదు. మూడో రోజు ఆటలో శ్రీలంక 86పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మెండిస్ బాధ్యాతాయుతంగా ఆడి సెంచరీ సాధించాడు. తద్వారా అతిపిన్న వయసులో టెస్ట్ సెంచరీ నమోదు చేసిన లంక ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. 21 ఏళ్ల 177రోజుల వయసులో సెంచరీ చేసిన కుశాల్.. గతంలో కలువితరణ (22 ఏళ్ల 267 రోజులు) నమోదు చేసిన రికార్డును బద్ధలు కొట్టాడు.
ఈ రోజు ఆటలో 243 బంతులను ఎదుర్కొన్న మెండిస్ 20 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 169 పరుగులు చేసి అజేయంగా క్రీజ్లో నిలిచాడు. దీంతో ఆట ముగిసే సమయానికి లంకేయులు ఆరు వికెట్లు కోల్పోయి 282 పరుగులు సాధించారు. 6/1 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక జట్టు ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ కౌశల్ సిల్వా(7),కరుణ రత్నే(0), మాథ్యూస్(9)లను స్వల్ప విరామంలో అవుట్ కావడంతో లంక కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మెండిస్ సమయోచితంగా ఆడి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. ఐదో వికెట్కు చండీమాల్(42) కలిసి 117 పరుగులు జత చేసిన మెండిస్.. ఆ తరువాత ధనంజయ డిసిల్వా(36)తో కలిసి 71 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వరుసగా రెండు కీలక భాగస్వామ్యాలు సాధించిన మెండిస్.. అదే క్రమంలో భారీ సెంచరీ సాధించాడు. దీంతో శ్రీలంకకు 196 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలే ఉండటంతో ఫలితం వచ్చే అవకాశం ఉంది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 117 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 282/6
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 203 ఆలౌట్