మెల్బోర్న్ (ఎంసీజీ గ్రౌండ్)
ప్రపంచ ప్రసిద్ధ స్టేడియాల్లో ఒకటి. గత వందేళ్లుగా ఆస్ట్రేలియా క్రీడారంగానికి ఇది ప్రత్యేకమైన మైదానంగా ఉంది. 1854లో స్థాపించిన ఈ మల్టీపర్పస్ స్టేడియంలో రగ్బీ, ఫుట్బాల్, క్రికెట్, ఇతర క్రీడలను ఆడతారు. టెస్టు, వన్డే క్రికెట్కు ఈ మైదానం పుట్టినిల్లు. 1877లో ఆసీస్, ఇంగ్లండ్ల మధ్య తొలి టెస్టు, 1970-71లో ఆసీస్, ఇంగ్లండ్ల మధ్య తొలి వన్డే జరిగింది ఇక్కడే. క్రీడా చరిత్రకు సంబంధించిన జాతీయ మ్యూజియం ఇక్కడే ఉంది. 1956 ఒలింపిక్స్, 2006 కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఆతిథ్యమిచ్చింది.
1980-90ల్లో దీన్ని క్రమంగా మెరుగుపర్చారు. మొదట్లో దీని సామర్థ్యం లక్షా 25 వేలు. కానీ మూడు వ్యక్తిగత ఎక్స్టెన్షన్లను తొలగించి లక్షకు కుదించారు. మూడు అంతస్తుల సదరన్ స్టాండ్ను 1992లో పూర్తి చేశారు. ఒక్క దీనిలోనే 50 వేల మంది కూర్చొంటారు. పాన్స్ఫోర్ట్ స్టాండ్లో ఖాళీ ప్రదేశాలు, ఒలింపిక్ స్టాండ్స్, కార్పొరేట్, మీడియా బాక్స్లు, స్పోర్ట్స్ గ్యాలరీ, రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డులు ఈ స్టేడియంలో ప్రత్యేకతలు. ఎంసీజీ పిచ్ బ్యాట్కు, బంతికి సమతుల్యంగా ఉండేటట్లు ఉంటుంది.
అయితే 1980, 90 ఆరంభాల్లో బౌన్సీ పిచ్లను తయారు చేయడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సిటీ సీబీడీకి స్వల్ప దూరంలో ఈ స్టేడియం ఉంటుంది. నగరంలో వ్యాపారం చేసే వాళ్లు తమ పని ముగించుకుని స్టేడియంలోకి వచ్చి రెండో సెషన్ మ్యాచ్ను తిలకించి వెళ్తారు. ఈ స్టేడియంలో ఫిబ్రవరి 14న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా; 22న దక్షిణాఫ్రికా, భారత్ మ్యాచ్లతో పాటు మార్చి 19న క్వార్టర్ఫైనల్-2, 29న ఫైనల్ జరగనుంది.