'ఆ కారణం వల్లే కోచ్ పదవి వద్దనుకున్నా'
ఢాకా: గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు పెరిగిపోవడంతోనే ఆ జట్టు క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగినట్లు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాల్ లోయ్ స్పష్టం చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ వచ్చిన వార్తలకు ఇటీవల అక్కడ జరిగిన దాడులు కూడా మరింత బలాన్నిస్తున్నాయన్నాడు. త్వరలో బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనున్న నేపథ్యంలో తన జట్టును లోయ్ హెచ్చరించాడు.
బంగ్లాదేశ్లో ఇంగ్లండ్ పర్యటించడంలో ఎటువంటి తప్పిదం లేదంటూనే, అక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. బంగ్లాదేశ్లో భద్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తరువాతే ఇంగ్లండ్ అక్కడకు వెళితేనే మంచిదన్నాడు. ప్రధానంగా అక్కడ తరచు జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగానే బంగ్లాదేశ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పినట్లు మాల్ తెలిపాడు. గత సెప్టెంబర్లో ఒక ఇటలీ దేశస్తున్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిందన్నాడు. ఇదిలా ఉండగా, గత నెల్లో బేకరీ కేఫ్ వద్ద జరిగిన ఉగ్రదాడుల్లో 20 మంది విదేశీయులతో పాటు మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.