ధోని తొలిసారి!
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారి దేశం బయట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీతో భారీ ఎండోర్స్ మెంట్ ఒప్పందం కుదురుకున్నాడు. దుబాయ్ కు చెందిన గ్రాండ్ మిడ్ వెస్ట్ (జీఎమ్) గ్రూప్ కంపెనీతో ధోని తాజాగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన జీఎమ్ గ్రూప్ .. ఇకనుంచి మూడు సంవత్సరాల పాటు ధోని తమ కంపెనీకి అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడని పేర్కొంది.
యూకే, దుబాయ్, ఐర్లాండ్ దేశాల్లో జీఎమ్ గ్రూప్ పలు రకాలైన హోటల్ వ్యాపారాలను కల్గివుంది. ఇప్పటికే యూఏఈలో స్థానిక క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేసిన సదరు కంపెనీ.. . ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ ద్వారా భారత్ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతోంది. దుబాయ్ కు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో కలిసి పనిచేయడం పట్ల ధోని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఒప్పందం పట్ల జీఎమ్ గ్రూప్ కు ధోని కృతజ్ఞతలు తెలియజేశాడు.