రాణించిన గంభీర్, ఉతప్ప

రాణించిన గంభీర్, ఉతప్ప


ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ 175  పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత కోల్ కతాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా కు ఓపెనర్లు గౌతం గంభీర్(59; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), ఉతప్ప(36;20 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించి శుభారంభాన్ని అందించారు.


 


ఈ జోడీ 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం తొలి వికెట్ గా ఉతప్ప పెవిలియన్ చేరాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్(21), ఆండ్రీ రస్సెల్(22) ఫర్వాలేదనిపించారు. ఇక చివర్లో యూసఫ్ పఠాన్(19 నాటౌట్;8 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.  ముంబై ఇండియన్స్ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా,మెక్లాన్గన్, హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top