కుమ్మేసిన కోల్ కతా
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కోల్ కతా నైట్ రైడర్స్ జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 16.2 ఓవర్లలో ఛేదించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది. రాబిన్ ఉతప్ప(59;33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గౌతం గంభీర్(71 నాటౌట్; 52 బంతుల్లో 11 ఫోర్లు)లు కుమ్మేసి జట్టుకు ఘన విజయం అందించారు. ఈ జోడి 108 పరుగుల భాస్వామ్యాన్ని సాధించడంతో కోల్ కతా ఖాతాలో మరో ఘన విజయం చేరింది. మరొకవైపు వరుస ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కు నిరాశే ఎదురైంది. ఇది కోల్ కతా కు ఏడో విజయం కాగా, ఢిల్ల్లీకి ఐదో ఓటమి.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కరుణ్ నాయర్(15) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి మరోసారి నిరాశపరిచాడు. అయితే ఆ తరుణంలో మరో ఓపెనర్ సంజూ శాంసన్ కు జత కలిసిన శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శాంసన్ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. శాంసన్ అవుటైన తరువాత శ్రేయస్ అయ్యర్ ఒక్కడే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా మిగతా వారు ఘోరంగా వైఫల్యం చెందారు. రిషబ్ పంత్(6), క్రిస్ మోరిస్(11), కోరీ అండర్సన్(2) నిరాశపరచగా, చివర్లో బావ్నే(12 నాటౌట్) అజేయంగా నిలిచాడు. చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 29 పరుగులు మాత్రమే చేయడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.