పాక్పై కివీస్ విజయం
వెల్లింగ్టన్: ప్రపంచకప్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో మరో 63 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్లతో నెగ్గింది. గ్రాంట్ ఇలియట్ (68 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు), రాస్ టేలర్ (81 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు) ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండు వన్డేల సిరీస్లో భాగంగా వెస్ట్పాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 45.3 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కివీస్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో... స్టార్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (29 బంతుల్లో 67; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) చెలరేగడంతో జట్టుకు ఆ మాత్రం స్కోరైనా దక్కింది. కెప్టెన్ మిస్బా (87 బంతుల్లో 58; 4 ఫోర్లు; 2 సిక్సర్లు)తో కలిసి 38 బంతుల్లోనే ఏడో వికెట్కు 71 పరుగులు జోడించాడు. ఇలియట్కు మూడు, మిల్స్, బౌల్ట్, అండర్సన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 39.3 ఓవర్లలో మూడు వికెట్లకు 213 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇలియట్, టేలర్ నాలుగో వికెట్కు అజేయంగా 112 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో వన్డే 3న నేపియర్లో జరుగుతుంది.