ఉమ్మడిగా ఆధిక్యంలో ఖాలిన్‌ జోషి, హిమ్మత్‌


సాక్షి, హైదరాబాద్‌: గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో ఖాలిన్‌ జోషి, హిమ్మత్‌ సింగ్‌ రాయ్‌లు తమ అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. శుక్రవారం రెండోరౌండ్‌ తర్వాత ఐదుగురు సంయుక్తంగా తొలి స్థానాన్ని పంచుకోగా... శనివారం గేమ్‌ తర్వాత  వీరిద్దరు మాత్రమే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన హిమ్మత్‌ సింగ్, బెంగళూరుకు చెందిన ఖాలిన్‌ జోషి మూడురౌండ్లు ముగిసేసరికి 205 పాయింట్లను సాధించారు.

వీరిద్దరూ మూడో రౌండ్‌లో చెరో 70 పాయింట్లు స్కోర్‌ చేశారు.



మరోవైపు శనివారం జరిగిన గేమ్‌లో షమీమ్‌ ఖాన్‌ (ఢిల్లీ), మరిముత్తు (బెంగళూరు) అద్భుత ప్రతిభ కనబరిచారు. మూడోరౌండ్‌లో నిర్దేశించిన 71 పాయింట్లకు గానూ వీరిద్దరు కేవలం 65 పాయింట్లు స్కోర్‌ చేసి 206 పాయింట్లు సాధించారు. దీంతో ఏకంగా 22 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. సరిగ్గా 71 పాయింట్లు సాధించిన వెటరన్‌ ప్లేయర్‌ ముఖేశ్‌ కుమార్‌ కూడా 206 స్కోరుతో సంయుక్తంగా  మూడో స్థానంలో ఉన్నారు. రెండో రౌండ్‌ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన అభిజిత్‌ సింగ్‌ (చండీగఢ్‌), కునాల్‌ బాసిన్‌ (ఆస్ట్రేలియా) శనివారం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అభిజిత్‌ మూడోరౌండ్‌లో 73 , బాసిన్‌ 75 పాయింట్లు స్కోర్‌ చేసి వరుసగా 7, 12 ర్యాంకులకు పడిపోయారు.  



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top