కేరళ బ్లాస్టర్స్ జెర్సీ, గీతం ఆవిష్కరణ
కొచ్చి: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్టు జెర్సీ, ప్రచార గీతాన్ని సోమవారం ఆవిష్కరించారు. పసుపు రంగుతో కూడిన జెర్సీ ధృడ సంకల్పం, నమ్మకానికి ప్రతీకగా సచిన్ అభివర్ణించాడు. జట్టు గీతాన్ని ఎం.ఎం.శ్రీలేఖ స్వరపరచగా... సింగర్ కళాభవన్ మణి కార్యక్రమంలో పాడారు. ‘అన్ని ఖండాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మా జట్టులో ఆటగాళ్లు ఉన్నందుకు సంతోషంగా ఉంది. వీరందరికి ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండే విధంగా మా జెర్సీ రంగును రూపొందించాం. ఇక మా గీతాన్ని శ్రీలేఖ చాలా బాగా రూపొందించింది. చిన్న వయస్సులోనే ఈ రంగంలోకి ప్రవేశించి 75 సినిమాలకు పాటలు స్వరపరచిన ఆమె త్వరలోనే సెంచరీ కొట్టాలి’ అని సచిన్ అభినందించాడు. మరోవైపు స్థానిక టాలెంట్ను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. భారత్లో నైపుణ్యతను చాలా ఆలస్యంగా గుర్తించడం జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోతున్నామని అన్నాడు. సచిన్ చేతుల మీదుగా తన పాట ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉందని శ్రీలేఖ తెలిపింది.