అమలు చేయక తప్పదా..!
ముంబై: జస్టిస్ ఆర్ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమలును బీసీసీఐ సీరియస్గా తీసుకోకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి నేడు (శుక్రవారం) అత్యవసరంగా తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎం) ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో లోధా సంస్కరణల అమలు గురించే ప్రత్యేకంగా చర్చించనున్నారు. వీటి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ సహా ఇతర సభ్యులను తప్పించి కొత్త కమిటీని ఎంపిక చేయాలని కోర్టుకు అందించిన నివేదికలో జస్టిస్ లోధా కమిటీ తేల్చి చెప్పింది. అయితే ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే కచ్చితంగా వాటి అమలు మినహా బోర్డుకు మరో దారి లేకుండా పోయి0ది. ఇలాంటి తరుణంలో నేటి ఎస్జీఎం ఎలాంటి పరిష్కారాన్ని కనుగొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఐదుగురు సెలక్టర్లలో ఇద్దరిని తప్పించే అవకాశం ఉంది.