డిక్లేర్ చేయడం మంచిది


అనిల్ కుంబ్లే

 

 మూడో టెస్టులో ఇప్పటికే చాలా సమయం వృథా అయ్యింది. కాబట్టి చివరి బ్యాట్స్‌మన్ సమయాన్ని వృథా చేయకుండా ఆడాలి. అవసరమైతే ఓవర్‌నైట్ స్కోరు వద్దే డిక్లేర్ చేస్తే మంచిది. ఈ సిరీస్‌ను గెలవాలని భారత్ భావిస్తే దూకుడును పెంచాలి. ఉదయం సెషన్‌లో ఎస్‌ఎస్‌సీ పిచ్ బౌలర్లకు బాగా సహకరిస్తుందని స్పష్టమవుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.  సానుకూలమైన ఫలితం రావాలంటే లంకను తక్షణమే బ్యాటింగ్‌కు దించాలి. పుజారా ప్రతిభతో భారత్ మంచి స్కోరే చేసింది. అతనికి జట్టులో చోటు దక్కడమే కష్టమైన నేపథ్యంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.



ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఐపీఎల్‌ను కాదని కౌంటీ క్రికెట్‌లో తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నాడు. అప్పటి కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తోంది. పిచ్‌పై బంతి బాగా స్వింగ్ అయినా పుజారా చాలా జాగ్రత్తగా ఆడాడు. దానికి కావాల్సింది ఓపిక. పుజారాలో దీనికి కొదువలేదు. సరైన సమయంలో పరుగులు సాధించాడు. మిశ్రా కూడా మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కూడా భారత్‌కు చాలా ఉపయోగపడింది. జట్టు విజయవంతం కావాలంటే లోయర్ ఆర్డర్‌లో మంచి భాగస్వామ్యాలు చాలా అవసరం.  లంకలో పరిస్థితులు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. వర్షం మధ్యలో స్పెల్స్ వేయాలంటే వేడి, తేమ వల్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆదివారం టీమిండియా బౌలర్లు చెలరేగడం భారత్‌కు చాలా కీలకం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top