కోల్‌కతాను నిలువరించిన గోవా

కోల్‌కతాను నిలువరించిన గోవా


మార్గోవా: తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాను... ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నీలో గోవా సమర్థంగా నిలువరించింది. ప్రత్యర్థుల పటిష్టమైన డిఫెన్స్‌కు అడ్డుకట్ట వేస్తూ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. దీంతో బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో ‘డ్రా’ అయ్యింది. కోల్‌కతా తరఫున ఆర్టా ఇజుమి వాలీ (13వ ని.) గోల్ చేయగా... కీనన్ అల్మిదా (81వ ని.) గోవాకు గోల్ అందించాడు.  పదేపదే గొడవకు దిగిన బల్జీత్ సహాని రెడ్‌కార్డుకు గురికావడంతో కోల్‌కతా పది మంది ఆటగాళ్లతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. గోవా డిఫెండర్ గ్రెగరీ ఆర్నోలిన్‌ను తలతో బాదడంతో సహానికి రిఫరీ రెడ్‌కార్డు చూపెట్టాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి రెడ్‌కార్డు.

 

 మ్యాచ్ మొత్తంలో ఎక్కువ శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న గోవా చాలా అవకాశాలను సృష్టించుకుంది. కానీ బలమైన కోల్‌కతా డిఫెన్స్ ఛేదించలేక ఒకే ఒక్క గోల్‌తో సరిపెట్టుకుంది. గోవా ఆటగాడు జోఫ్రి మ్యాటూ పిన్‌పాయింట్ క్రాసెస్‌తో ఆకట్టుకున్నాడు. 13వ నిమిషంలోనే కోల్‌కతా ఆధిక్యంలోకి వెళ్లడంతో రెండో అర్ధభాగంలో గోవా ఎదురుదాడులకు దిగింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు మొరటుగా ఆడటంతో కాస్త ఆగ్రహావేశాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆరుగురు ఆటగాళ్లు ఎల్లో కార్డుకు గురయ్యారు. కోల్‌కతా పది మందితోనే ఆడటం చివర్లో గోవాకు కలిసొచ్చింది. గురువారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో చెన్నైయిన్ జట్టు తలపడుతుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top