ఫ్ర్రాంచైజీలను ఆలోచనలో పడేశాడు..
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే వేలంలో ఆటగాళ్ల జాబితాను ఇటీవల 351 మందికి కుదించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్గా 799 మందితో ఈ జాబితాను రూపొందించినా అందులో వడపోత అనంతరం 448 మందిని తప్పించారు. అయితే తాజాగా మరొక భారత ఆటగాడ్ని వేలం జాబితాలో చేర్చక తప్పలేదు. జార్ఖండ్ కు చెందిన ఇషాంక్ జగ్గీకి అనూహ్యంగా ఐపీఎల్ ఆటగాళ్ల వేలం లిస్ట్లో చోటు కల్పిస్తూ భారత క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చించిన తరువాత జగ్గీకి చోటు కల్పించారు.0. ఇందుకు కారణం అతని తాజా దేశవాళీ టోర్నీలో ప్రదర్శనే.
శనివారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో జగ్గీ విశేషంగా రాణించాడు. ముస్తాక్ అలీ ట్వంటీ 20 లో ఈస్ట్ జోన్ కు ఆడిన జగ్గీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సెంట్రల్ జోన్ పై 37 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేయగా, సౌత్ జోన్ పై 51 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఆ తరువాత వెస్ట్ జోన్ పై 34 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. దాంతో అటు బీసీసీఐని, ఇటు ఫ్రాంఛైజీలను జగ్గీ ఆలోచనలో పడేసి వేలం జాబితాలో బెర్తును దక్కించుకున్నాడు. అతని కనీస ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించారు. చివరి నిమిషంలో అదృష్టం వరించి ఐపీఎల్ రేసులో నిలిచిన జగ్గీని రేపు(సోమవారం) జరిగే వేలంలో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తోందో చూడాలి.