ఇదంతా ‘బిర్యానీ' కోసమేనా?

ఇదంతా ‘బిర్యానీ' కోసమేనా?


సాక్షి, హైదరాబాద్: బిర్యానీ తినేందుకు అనుమతించని కారణంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని ఆగ్రహంతో హోటల్ మారిపోతాడా! బోర్డు రూమ్‌లో బిర్యానీ తినకూడదనే నిబంధనతో మొత్తం క్రికెట్ జట్టు బయటికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు... దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న ఒక పెద్ద హోటల్ పోతే పోనీ అనుకుంటుందా! ఇదే కారణం అని బయటకు చెబుతున్నా... ఇందులో వాస్తవం ఉండకపోవచ్చని అనిపిస్తోంది. ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... చాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు నగరానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిగతా టీమ్‌లతో పాటు గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బస చేసింది. అయితే కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు మంగళవారం అనూహ్య సంఘటన జరిగింది. భారత క్రికెటర్ అంబటి రాయుడు తన సహచరుల కోసం ఇంటి నుంచి ప్రత్యేకంగా బిర్యానీ చేయించి జట్టు ఉన్న హోటల్‌కు పంపించాడు.  అయితే కాకతీయ యాజమాన్యం దానికి అనుమతించలేదు. హోటల్ నిబంధనల ప్రకారం బయటి భోజనం తీసుకు రావడానికి వీల్లేదు. అయినా సరే...భారత క్రికెట్ జట్టు కాబట్టి కాస్త సడలింపు ఇస్తూ తమ రూమ్‌లలో తినేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. దీనిని కాదని ధోని అందరం ఒకే చోట అంటూ బోర్డు రూమ్‌లో తినేందుకు ప్రయత్నించాడు. దీనికి హోటల్ యాజమాన్యం అంగీకరించపోవడం ధోనికి ఆగ్రహం తెప్పించింది. దాంతో జట్టు సభ్యులందరితో కలిసి అతను సమీపంలోని తాజ్ కృష్ణ హోటల్‌కు మారిపోయాడు. ఇదే హోటల్‌లో బస చేసిన బీసీసీఐ అధికారులు కూడా ధోని వెంటే తాజ్‌కు వెళ్లిపోగా.... ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ కూడా ఇక్కడ తన బుకింగ్‌ను రద్దు చేసుకోవడం విశేషం! ఇక్కడ ఆటగాళ్లు, అధికారుల కోసం 180 రూమ్‌లు బుక్ చేశారు. ‘బిర్యానీనే కారణమా కాదా చెప్పలేను గానీ ధోనికి ఈ హోటల్ నచ్చలేదనేది మాత్రం వాస్తవం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. గురువారం చెన్నై జట్టు బెంగళూరు బయల్దేరి వెళ్లింది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top