పసికూనతో విండీస్, పాక్కు దడ


మాజీ చాంపియన్ వెస్టిండీస్ తాజా ఓటమితో నాకౌట్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఉపఖండం జట్టు పాకిస్థాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గ్రూపు-బి టాపర్ భారత్ (8)తో పాటు దక్షిణాఫ్రికా (6)కు బెర్తులు ఖరారయ్యాయి. ఇదే గ్రూపులో జింబాబ్వే (2), యూఏఈ (0) ఇంటిదారిపట్టగా.. మిగిలిన మరో రెండు బెర్తుల కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ తలా రెండు విజయాలతో నాకౌట్ రేసులో ఉన్నాయి. కాగా లీగ్ దశలో ఐర్లాండ్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సివుండగా, పాక్ రెండు, విండీస్ ఓ మ్యాచ్ మాత్రమే ఆడాల్సివుంది. ఈ నేపథ్యంలో నాకౌట్ రేసులో మాజీ చాంపియన్స్ పాక్, విండీస్లకు పసికూన ఐర్లాండ్ దడ పుట్టిస్తోంది. ఈ మూడింటిలో ఏ రెండు క్వార్టర్స్కు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.



లీగ్ దశలో విండీస్.. యూఏఈతో మాత్రమే ఆడనుంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో విండీస్ గెలవడం ఖాయం. కాబట్టి కరీబియన్ల ఖాతాలో 6 పాయింట్లు చేరుతాయి. ఇక పాకిస్థాన్.. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్లతో తలపడనుంది. నిలకడలేని పాక్.. సఫారీలపై గెలవడం కష్టం. స్థాయిని మించి ఆడుతున్న ఐర్లాండ్తోనూ గట్టి పోటీ ఎదురుకావచ్చు. ఈ రెండింటిలో పాక్ ఓడినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఐర్లాండ్పై గెలిస్తే పాక్ 6 పాయింట్లతో రేసులో ఉంటుంది. ఐర్లాండ్ విషయానికొస్తే జింబాబ్వే, పాక్, భారత్లతో ఆడనుంది. జింబాబ్వేపై ఐర్లాండ్ గెలిచే అవకాశాలున్నాయి. భారత్, పాక్ లతో కష్టమే. ఐర్లాండ్ ఒక్క మ్యాచ్లో నెగ్గినా 6 పాయింట్లతో విండీస్, పాక్తో పాటు నాకౌట్ రేసులో ఉంటుంది. ఇదే కనుక జరిగితే ఈ మూడు జట్లకు రన్రేట్ కీలకమవుతుంది. ఈ మూడు జట్లలో ఏ రెండు క్వార్టర్స్ కు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top