ఐపీఎల్లో ఆట ప్రామాణికం కాదు:ధోని
పుణె: అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ప్రదర్శన ఎంతమాత్రం ప్రామాణికం కాదని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా టెస్టుల్లో, వన్డేల్లో ఆడటానికి ఐపీఎల్లో ఆటను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆటగాడిలో ఉన్న ప్రతిభను తెలుసుకోవడానికే మాత్రమే ఐపీఎల్ లాంటి లీగ్లు ఉపయోగపడతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
టాలెంట్ ను గుర్తించడానికి మాత్రమే ఐపీఎల్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్న విషయం ప్రతీ యువ ఆటగాడు గుర్తించాలన్నాడు. ఇదే విషయాన్ని తాను పదే పదే చెబుతూ ఉంటానన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లు రాణించాలంటే దేశవాళీ లీగ్లో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఐపీఎల్ ఆట తీరు ఆధారంగా ఆటగాళ్లను టెస్టులకు, వన్డేలకు ఎంపిక చేయడం సరైన పద్ధతి కానేకాదన్నాడు. భారత-శ్రీలంక జట్ల మధ్య మంగళవారం తొలి టీ 20 జరుగనున్న నేపథ్యంలో ఇక్కడకు విచ్చేసిన ధోని మీడియాతో ముచ్చటిస్తూ పైవిధంగా స్పందించాడు.